జగపతి బాబు...మరో పునర్జన్మ!

5 Aug, 2013 15:06 IST|Sakshi
జగపతి బాబు...మరో పునర్జన్మ!

చాలాకాలంగా విజయానికి దూరంగా ఉన్న ఫ్యామిలీ హీరో జగపతిబాబు చాలా రోజుల aతర్వాత మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. తాను ప్రస్తుతం చేస్తున్న పాత్ర పునర్జన్మ లాంటిదని అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జగపతి బాబు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను కొన్ని చిత్రాలు చేశానని, అయితే అవి ఎప్పుడు విడుదలై వెళ్లిపోయాయో కూడా తనకు తెలియదని అన్నారు. అందుకే ఇక నుంచి తాను పోషించే పాత్రల గురించి కేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మార్పు తనకు పునర్జన్మ వంటిదని ఆయన అన్నారు.

బాలయ్యతో కలిసి నటించటం తనకు సంతోషంగా ఉందని,  తామిద్దరంమంచి స్నేహితులం కూడా అని జగపతి బాబు అన్నారు. దీంతో పాటు ఓ మంచి దర్శకుడితో పని చేయటం ఆనందంగా ఉందన్నారు. తాను ఈ చిత్రంలో మూడు తరాలకు సంబంధించి మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తానని, అందుకోసం తన బాడీ లాంగ్వేజ్లో చాలా మార్పు చూపించాల్సి వచ్చిందన్నారు.

ఇప్పటి వరకూ తనకు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉందని, అయితే విలన్ పాత్రను పోషించే ఈ నిర్ణయం కొంతమందికి బాధకరమైనా తప్పదన్నారు. ఇంతకు ముందులానే తనను ఆదరించాలని జగపతి బాబు కోరారు. ప్రేక్షకులు కూడా తన పాత్రని అంగీకరించి, ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాని సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మరి కొత్త పాత్రలో జగపతి బాబును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.