ఐదుగురు భామలతో జైఆకాశ్ రొమాన్స్

25 Jul, 2016 01:49 IST|Sakshi
ఐదుగురు భామలతో జైఆకాశ్ రొమాన్స్

మంచి విజయం కోసం పోరాడుతున్న నటుల్లో జైఆకాశ్ ఒకరు. అందుకు ఆయన చేస్తున్న తాజా ప్రయత్నం అమావాసై చిత్రం. జైఅకాశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయన చిత్రాలు  చాలా వరకు బహుభాషా చిత్రాలుగానే ఉంటాయి. ఈ అమావాసై చిత్రాన్ని కూడా  తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జైఆకాశ్ ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం విశేషం. జయా ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేశ్ సావంత్ కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మాటలను బాబా రాయగా సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు సయ్యద్ అహ్మద్, చాయాగ్రహణంను డేవిడ్ బాసు అందిస్తున్నారు.

ఇందులో జైఆకాశ్ సరసన సాక్షి, శోగన్, ప్రీతీసింగ్, తాన్యామౌర్య, ముమైత్‌ఖాన్ నటించారు.ఇతర పాత్రల్లో నుపూర్‌మేతా, రాజేశ్‌వివేక్, జీవా, శ్రావణ్ నటించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను కోటాశ్రీనివాసరావు పోషించారు. చిత్రం గురించి దర్శక నిర్మాత రాజేశ్ సావంత్ తెలుపుతూ ఇది హారర్ నేపథ్యంంతో సాగే మ్యూజికల్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. చిత్ర షూటింగ్‌ను రాజస్తాన్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించామని వివరించారు. భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ అమావాసై చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజేశ్ సావంత్ వెల్లడించారు.