జనతా కర్ఫ్యూ : వారికి టాలీవుడ్‌ సలాం..

22 Mar, 2020 18:20 IST|Sakshi

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ తో యావత్‌ భారతావనిని ఏకతాటిపైకి వచ్చింది. సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు మోదీ పిలుపు మద్దతుగా నిలిచి.. ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి ప్రజలంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు చప్పట్లతో అభినందనలు తెలిపిన వీడియోను కొందరు తెలుగు సినీ ప్రముఖులు తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

మనందరి కోసం పనిచేస్తున్నవారికి ప్రజలు బాల్కనీలో నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలుపడం గౌరవంగా ఉందని హీరో రామ్‌చరణ్‌ అన్నారు. మరో హీరో ఎన్టీఆర్‌ వైద్య, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారికి తన కుమారుడితో కలిసి చప్పట్లు, గంట కొట్టి అభినందనలు తెలిపారు. చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపిన మంచు మనోజ్‌.. వందేమాతరం అంటూ నినదించారు. 

మెగా ఫ్యామిలీ, మోహన్‌బాబు కుటుంబం, అల్లు ఫ్యామిలీ, రాజశేఖర్‌ -జీవిత ఫ్యామిలీ, శ్రీకాంత్‌ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం, సుకుమార్‌ ఫామిలీ లు కూడా తమ చప్పట్లతో ప్రజల కోసం సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, అత్యవసర విభాగాల సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఇంకా సినీ ప్రముఖులు చార్మి, శ్రీకాంత్‌, గుణశేఖర్‌, పూజా హెగ్డే, గోపిచంద్‌, పూరి జగన్నాథ్‌, అనిల్‌ రావిపూడి, పవన్‌ కల్యాణ్‌, రమ్యకృష్ణ, కృష్ణవంశీ, నిఖిల్‌, విశ్వక్‌సేన్‌లు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు