సినిమా: అమ్మ పుట్టింటికి అతిథిగా అడుగిడనుందో అందాల భరిణ. ఆ చిన్నది ఎవరో కాదు అతిలోకసుందరి ముద్దుల కూతురు జాన్వీకపూర్. నటి శ్రీదేవికి పుట్టిల్లు తమిళనాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో మంచి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నా ఆ దివంగత అందాలరాశి పుట్టినిల్లు తమిళనాడు, మెట్టినిల్లు ముంబైనే. అక్కడ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ను పెళ్లి చేసుకుని ఉత్తరాది కోడలైంది. ఈ దంపతుల పెద్ద కూతురు తల్లి అడుగుజాడల్లోనే పయనించాలని నిర్ణయించుకుని నటిగా రంగప్రవేశం చేసింది. దురదృష్టం ఏమిటంటే జాన్వీకపూర్ తొలి చిత్రం నిర్మాణ దశలో ఉండగానే శ్రీదేవి హఠాన్మరణం పొందింది.
శ్రీదేవికి తన పిల్లలు సినీరంగంలోకి రావడం ఇష్టం లేకపోయినా, వారి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చింది. ఎప్పుడైతే పెద్ద కూతురు కథానాయకిగా హిందీ చిత్ర రంగంలోకి ప్రవేశించిందో, తను తమిళంలోనూ నటించాలని శ్రీదేవి కోరుకుందట. అది ఆమె జీవించి ఉండగా నెరవేరకున్నా ఇప్పుడు జరగబోతోందని తాజా సమాచారం. జాన్వీ తండ్రి బోనీకపూర్ తమిళంలో చిత్ర నిర్మాణానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇక్కడ రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ నటుడు అజిత్ హీరోగా నటించబోతున్నారు. అందులో ఒకటి హిందీ చిత్రం పింక్కు రీమేక్. హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుంది. ఇందులో అజిత్కు జంటగా నటి విద్యాబాలన్ నటించనున్నారు. ఈ చిత్రంలో అతిథి పాత్రలో జాన్వీకపూర్ మెరవడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత ఇక్కడ మరిన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించే అవకాశం లేకపోలేదని కోలీవుడ్ వర్గా లు పేర్కొంటున్నాయి. మొత్తం మీద అతి లోక సుందరి పుట్టింట్లో ఆమె తన య నట పయనం మొదలవబోతోందన్న మాట.