ఆసక్తికర విషయాలు వెల్లడించిన జాన్వీ కపూర్‌

9 Sep, 2019 13:42 IST|Sakshi

‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించారు అందాల నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికి తనకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు జాన్వీ. తాజాగా బ్రైడ్స్‌ టుడేకిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. శ్రీదేవి ఉన్నప్పుడు మీ పెళ్లి గురించి చర్చించేవారా అని ప్రశ్నించగా.. ‘దీని గురించి మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే మా అమ్మకు నా మీద నమ్మకం తక్కువ. నేను త్వరగా ప్రేమలో పడతానని తన అభిప్రాయం. నా జడ్జిమెంట్‌ మీద అమ్మకు నమ్మకం లేదు కాబట్టి నా కోసం తనే ఓ అబ్బాయిని చూస్తానని చెప్పేది’ అన్నారు జాన్వీ.

ఇక చేసుకోబోయే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్నించగా.. ‘చేసే పని పట్ల తనకు శ్రద్ధ, నిబద్ధత ఉండాలి. తన నుంచి నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలి. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. నేనేంటే పడి చచ్చిపోవాలని’ చెప్పుకొచ్చారు. మరి పెళ్లి ఎలా జరగాలని కోరకుంటున్నారని ప్రశ్నించగా.. ‘అట్టహసంగా, వైభవంగా జరిగే వేడుకలకు నేను దూరం. అందుకే నా వివాహం చాలా సాంప్రదాయబద్ధంగా తిరుపతిలో జరుగుతుంది. పెళ్లిలో నేను కంజీవరం జరీ చీర ధరిస్తాను. వివాహం తర్వాత నాకు ఇష్టమైన దక్షిణ భారతదేశ వంటకాలతో బ్రహ్మండమైన దావత్‌ ఉంటుంది. దానిలో ఇడ్లీ, సాంబార్‌, పెరుగన్నం, పాయసం వంటివి ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్‌.

మరిన్ని వార్తలు