ప్రేమ కోసం యుద్ధం!

10 Aug, 2018 01:04 IST|Sakshi
ఆలియా భట్,రణ్‌వీర్‌సింగ్, జాన్వీ కపూర్‌

మొగల్‌ సామ్రాజ్యం గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కొన్ని సినిమాల్లో చూశాం. కానీ మొగల్‌ సామ్రాజ్యంలోని మరో కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు బీటౌన్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహర్‌. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ సినిమా తర్వాత ‘తక్త్‌’ సినిమాకు పూర్తి స్థాయి దర్శకునిగా చార్జ్‌ తీసుకున్నట్లు ఆయన గురువారం వెల్లడించారు. ఈ పీరియాడికల్‌ మూవీలో అనిల్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశాల్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్‌ ముఖ్య తారలుగా నటించనున్నారు.

ధర్మ ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా మొగల్‌ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం. ‘‘చరిత్రలో పాతుకుపోయిన ఓ అద్భుతమైన కథను వెండితెరపైకి తీసుకు రాబోతున్నాం. ఒక కుంటుంబానికి ఉన్న ఆశ, లక్ష్యాలు, ప్రేమ, విజయాల సమాహారంతో ఈ సినిమా సాగుతుంది. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ‘వార్‌ ఫర్‌ లవ్‌’’ అని కరణ్‌ జోహార్‌ పేర్కొన్నారు. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ధడక్‌’ సినిమాతో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ సిల్వర్‌స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడీ మల్టీస్టారర్‌ మూవీలో సీనియర్‌ యాక్టర్స్‌తో కలిసి నటిస్తే ఆమె కెరీర్‌కు మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది. ‘ధడక్‌’ నిర్మాత కరణ్‌ జోహార్‌ అనే విషయం తెలిసిందే. రెండో సినిమా కూడా ఆయన కాంబినేషన్‌లో కుదిరిందంటే.. జాన్వీ యాక్టింగ్‌ స్కిల్స్, ప్రవర్తన కరణ్‌కి నచ్చి ఉంటాయి. పెళ్లి తర్వాత కరీనా కపూర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన థర్డ్‌ మూవీ ఇది. పెళ్లి తర్వాత ‘వీరే దే వెడ్డింగ్‌’ సినిమాలో నటించిన కరీనా.. రీసెంట్‌గా అక్షయ్‌ కుమార్‌ ‘గుడ్‌న్యూస్‌’ సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు