ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు

29 Dec, 2019 00:16 IST|Sakshi
జాన్వీ కపూర్‌

‘గుంజన్‌ సక్సేనా’ చిత్రాన్ని ముగించి ఈ ఏడాదికి గుడ్‌ బై చెప్పారు జాన్వీ కపూర్‌. భారత వైమానిక దళంలో మొదటి మహిళా పైలైట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’. శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ టైటిల్‌ రోల్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ – ‘‘గుంజన్‌ సక్సేనా’ చిత్రాన్ని పూర్తి చేశానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమా అనుభవాన్ని క్లుప్తంగా మాటల్లో చెప్పేందుకు రెండు రోజులు ఆలోచించాను. కానీ నాకు ఏమీ  తోచలేదు. ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను. నా స్నేహితుడు, దర్శకుడు శరణ్‌ శర్మకు ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. అలాగే ‘గుంజన్‌ సక్సేనా’ సినిమాకు సంబంధించిన మరో వర్కింగ్‌ స్టిల్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘రుహీ అఫ్జా దోస్తానా 2, తక్త్‌’ సినిమాల  చిత్రీకరణలతో జాన్వీ వచ్చే ఏడాది ఫుల్‌ బిజీ.

మరిన్ని వార్తలు