ఇదో తల్లీ కొడుకుల రికార్డు

12 Oct, 2017 10:12 IST|Sakshi

నటిగా నేను, సంగీత దర్శకుడిగా నా కొడుకు అమ్రేష్‌ ఒకేసారి చిత్ర పరిశ్రమలో కొనసాగడం ఒక రికార్డు అని సీనియర్‌ నటీమణి, దర్శక, నిర్మాత జయచిత్ర పేర్కొన్నారు. తెలుగు చిత్రాల ప్రముఖ దర్శకులు సుకుమార్‌ నిర్మాతగా ఏవీఏం స్టూడియోలో హండ్రెడ్‌ పర్సంట్‌ కాదల్ చిత్ర షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జయచిత్ర సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

సాక్షి, చెన్నై : హీరోయిన్ గా, తల్లిగా, అత్తగా,  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇప్పటివరకు సుమారు రెండు వందల పై చిలుకు చిత్రాల్లో నటించాను. డైరెక్టర్‌ కే.బాలచందర్‌ సతీమణిగా సుమారు ఎనిమిదేళ్ల క్రితం నటించిన రెట్టైసుళి చిత్రం, ఐదేళ్ల క్రితం విడుదలైన జూనియర్‌ ఎన్ టీఆర్‌ హీరోగా నటించిన నరశింహుడు చిత్రాల తరువాత కుటుంబ బాధ్యతలకు దగ్గరగా సినిమాలకు దూరంగా ఉన్నాను.

హీరోగా రాణించి, సంగీత దర్శకుడుగా సైతం ఎదుగుతున్న కుమారుడు అమ్రేష్‌కు తల్లిగా అండదండలు ఇవ్వడంలోని ఆనందాన్ని పొందుతున్నాను. నేను షూటింగులకు వెళ్లేటపుడు తాను సపర్యలు చేసేవాడు, ఈరోజు తనకు నేను సహకరించడం, సినీ పరిశ్రమలో పొందుతున్న పేరు ప్రఖ్యాతులను దగ్గరుండి చూడడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంది.

నాలుగో ఇన్నింగ్స్‌ ఆరంభం
నటీమణిగా నా హయాంలో తొలితరం హీరోలు ఎంజీ రామచంద్రన్, శివాజీగణేశన్, రెండోతరం కమల్‌హాసన్, రజనీకాంత్, మూడోతరం అజిత్, విజయ్‌లతో ముచ్చటగా మూడు ఇన్నింగ్స్‌ను విజయవంతంగా పూర్తిచేశాను. హండ్రెడ్‌ పర్సంట్‌ కాదల్ (హండ్రడ్‌ పర్సంట్‌ లవ్‌ తెలుగు చిత్రానికి రీమేక్‌) తమిళ చిత్రంలో నాలుగోతరం హీరో అయిన జీవీ ప్రకాష్‌తో నాలుగో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాను.

చిత్ర కథను క్లుప్తంగా వివరిస్తూ ఒక అబ్బాయి, అమ్మాయి లు కలిగిన తరువాత ఏర్పడిన మనస్పర్థల వల్ల నేను భర్త (నాజర్‌) విడిపోతాం. అయితే మా పిల్లల పిల్లలు ( హీరో హీరోయిన్లు) ప్రేమించుకున్నా చిన్న గొడవ కారణంగా పెళ్లి చేసుకోకుండానే విడిపోతారు. వారిద్దరిలోని మనస్పర్థలు తొలగించి కలపడమే నా క్యారెక్టర్‌. నేను పిల్లలను కలిపితే పిల్లలు మా జంటను కలుపుతారు. సినిమాలో నాది కీరోల్‌. ఇలాంటి కీలకమైన పాత్ర వస్తే నటించేందుకు రెడీ.

ఆలోచనలో పడ్డాను
ఇటీవల నేను ఏ ఫంక్షన్ కు వెళ్లినా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని పదే పదే అడగడంతో ఆలోచనలో పడ్డాను. ఇన్నాళ్లూ ఉద్దేశపూర్వకంగా సినిమాలకు దూరంగా ఉండలేదు. ఈ క్యారెక్టర్‌కు మీరే కావాలని ఎవరైనా వస్తే కాదనే ప్రసక్తేలేదు. బుధవారం ప్రారంభమైన తమిళ చిత్ర దర్శకులు చంద్రమౌళి, నిర్మాతలు నా ఇంటికి వచ్చి కోరడం, మంచి చిత్రకథాంశం కావడంతో అంగీకరించాను.

మరలా నేను సినిమా ఒప్పుకోవడంతో అమ్రేష్‌ ఎంతో ఆనందించాడు. ఆకలితో రాత్రి నిద్రపట్టక పోవడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు స్వయంగా ఆమ్లేట్‌ తినిపించాడు. అదేంటిరా అని అడిగితే నాకు నీవు చేస్తున్నావు, నీకు నేను చేస్తే తప్పేంటి అని చిరునవ్వుతో సమాధనం ఇచ్చాడు. బుధవారం పొద్దున్నే లేచి సాగనంపాడు. నటిగా తల్లి, హీరో, సంగీత దర్శకునిగా కొడుకు ఒకేసారి చిత్ర పరిశ్రమలో ఉండడం బహుశా ఇది ఒక రికార్డు.

మరిన్ని వార్తలు