మళ్లీ వెండితెర మీదకు జయప్రద

5 May, 2015 15:07 IST|Sakshi
మళ్లీ వెండితెర మీదకు జయప్రద

తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలి.. ఇక్కడి నుంచి బాలీవుడ్కు వెళ్లి అక్కడ కూడా రాజ్యమేలి.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ మూవీలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం 5 పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తనలోని టాలెంట్ ఏమాత్రం తగ్గలేందంటున్న జయప్రద.. చిట్టచివరిసారిగా కంగనా రనౌత్తో కలిసి 2013లో రజ్జో అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశారు.

ఇప్పుడు కొత్త సినిమాలో చేయడానికి తాను చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జయప్రద అంటున్నారు. రాణీ సాహిబా అనే తన పాత్ర చాలా గ్లామరస్గా ఉంటూనే అందులో నెగెటివ్ షేడ్ కూడా ఉంటుందని ఆమె చెప్పారు. నేటి ప్రేక్షకులు భిన్నమైన కథలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్ర ఏదీ చేయలేదని, అందుకే ఈ సినిమా చాలా ధైర్యంగా చేయాల్సి వస్తోందని జయ అన్నారు. ఈ సినిమా షూటింగ్ మలేసియా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో సాగుతోంది. ఈ హిందీ సినిమాతో పాటు ఓ మళయాళం సినిమాలో కూడా జయప్రద చేస్తోంది.