యూనివర్శల్‌ పాయింట్‌తో...

22 Jan, 2018 01:42 IST|Sakshi

పొలిటికల్‌గా బిజీ అయ్యాక నటిగా తక్కువ సినిమాలు చేస్తున్నారు జయప్రద. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా తమిళ సినిమాల్లో జయప్రద కనిపించి, దాదాపు పదేళ్లు కావొస్తోంది. కమల్‌హాసన్‌తో చేసిన ‘దశావతారం’ తమిళంలో తన లాస్ట్‌ సినిమా.  ఇప్పుడు ఎమ్‌.ఏ నిషాద్‌ రూపొందిస్తున్న తమిళ, మలయాళ బైలింగ్వల్‌ ‘కేనీ’ సినిమాలో ‘ఇందిరా’ అనే గ్రామీణ స్త్రీ పాత్ర ద్వారా తమిళ తెరకు రీ–ఎంట్రీ ఇస్తున్నారు జయప్రద.

తమిళనాడు–కేరళ మధ్యలో సాగుతున్న నీటి వివాదం ‘ములైపెరియార్‌ డ్యామ్‌’ ఆధారంగా ఈ కథ సాగుతుందట. ఈ సినిమా గురించి జయప్రద మాట్లాడుతూ – ‘‘కెనీ’ కేవలం తమిళనాడు–కేరళ కాదు.. ఇది యూనివర్శల్‌ పాయింట్‌. పాలిటిక్స్‌లోకి వెళ్లాక  రాజస్థాన్, గుజరాత్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి సమస్యలను చూశాను. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో ఆ పెయిన్‌ కనిపిస్తుంది’’  అన్నారు. రేవతి, అనూహాసన్, నాజర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జయచంద్రన్‌ సంగీతంలో 25 ఏళ్ల తర్వాత జె.ఏసుదాస్, బాల సుబ్రహ్మణ్యం కలిసి ఈ సినిమా కోసం ఒక పాట పాడటం విశేషం.

మరిన్ని వార్తలు