ఇటీవలే మహేశ్ మహర్షిగా మారిన సంగతి తెలిసిందే. అదేనండీ తన లేటెస్ట్ సినిమా టైటిల్ను ‘మహర్షి’గా ఫిక్స్ చేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో మహేశ్ పాత్ర పేరు రిషి. ఆ రిషి మహర్షిగా మారడానికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నింటికీ స్ఫూర్తి వాళ్ల అమ్మగారేనట.
మరి అలాంటి పాత్ర పోషించడానికి జయప్రదను సంప్రదించారట ‘మహర్షి’ చిత్రబృందం. మహేశ్బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో మహేశ్బాబు తల్లి పాత్ర కోసం జయప్రదను అడిగారని, ఆమె కూడా ఈ పాత్ర పట్ల సుముఖంగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.