ట్రైలర్‌పై ఘాటుగా స్పందించిన జీవిత

3 May, 2019 13:38 IST|Sakshi

అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాల తరువాత టాలీవుడ్‌లో బోల్డ్‌ కంటెంట్‌తో కూడిన సినిమాలు ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని తాజాగా జీవితా రాజశేఖర్‌ ప్రస్తావించారు. ‘డిగ్రీ కాలేజ్‌’ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె.. చిత్రయూనిట్‌పై, ట్రైలర్‌పై ఘాటుగా స్పందించారు. 

జీవిత మాట్లాడుతూ.. ‘ ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ పుణ్యమా అనీ, లిప్ లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. మనం ఇల్లు కట్టుకుంటే హాలులో కూర్చుంటాము .. బెడ్ రూములో పడుకుంటాము .. బాత్ రూమ్ లో స్నానం చేస్తాము. కానీ హాల్లోకి వచ్చి స్నానం చేయం గదా. ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి .. రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది. మనకూ కుటుంబాలు వున్నాయి .. ఆడపిల్లలు వున్నారు అనే సామాజిక బాధ్యతతో సినిమాలు చేయవలసిన అవసరం వుంది. ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి... సోషల్ మీడియాలో.. టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదిస్తారు. నిజమే ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూములో.. ఒక్కరం కూర్చుని చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది. చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మూవీలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు .. నా మనసుకి అనిపించింది చెప్పాను" అని అన్నారు.

మరిన్ని వార్తలు