జాన్వీ@టెంపర్‌

27 Jan, 2018 01:00 IST|Sakshi
రణ్‌వీర్‌ సింగ్‌, జాన్వీ కపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. శషాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ కట్టర్‌తో జోడీ కట్టారు జాన్వీ. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్‌ జాన్వీని వరించిందని బీ టౌన్‌ టాక్‌. ఎన్టీఆర్, కాజల్‌ జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్‌’ సినిమా ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘శింబా’ పేరుతో హిందీలో రీమేక్‌ చేయనున్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ ఈ చిత్రం నిర్మించనున్నారట. ఇందులో జాన్వీ కపూర్‌ని కథానాయికగా తీసుకున్నారని బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తెలుగులో కాజల్‌ చేసిన పాత్రకంటే ‘శింబా’లో జాన్వీ పాత్రను మరింత క్యూట్‌గా మలచనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. జాన్వీ ఫస్ట్‌ మూవీ ‘ధడక్‌’ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ‘టెంపర్‌’ రీమేక్‌కి కూడా ఆయనే నిర్మాత. ఒకవేళ జాన్వీ నటన నచ్చి, ‘టెంపర్‌’కి కూడా తీసుకోవాలనుకున్నారేమో? అని బాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు