జీవాతో ‘భయపడొద్దు’

7 Mar, 2015 02:02 IST|Sakshi
జీవాతో ‘భయపడొద్దు’

నటుడు జీవాతో భయపడవద్దు అంటున్నారు ఆర్‌ఎస్ ఇన్ఫో ట్రైయిన్‌మెంట్ అధినేత ఎల్‌రెడ్ కుమార్, దర్శకుడు డీకే నటుడు జీవాకు ఈ మధ్య సరైన హిట్ సినిమా లేదు. ఆయన నటించిన నీ దానే ఎన్ పొన్ వసంతం, యాన్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో జీవా కాస్త డీలా పడ్డ విషయం నిజమే. అందుకే కొంచెం ఆలస్యం అయినా సరే మంచి కథా చిత్రాలనే ఎంచుకోవాలని ఆశించిన జీవా ఇప్పుడు మళ్లీ కార్మోన్ముకుడవుతున్నారు.

వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలన్న చందాన ఇంతకుముందు నీ దానే ఎన్‌పొన్ వసంతం, యాన్ చిత్రాలను చేసిన ఆర్ ఎస్ ఇన్ఫోట్రైయిన్‌మెంట్ సంస్థలోనే తదుపరి చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సంస్థ ఇంతకుముందు డీకే దర్శకత్వంలో నిర్మించిన యామిరుక్క భయమే చిత్రం ఘనవిజయం సాధించింది.

ఇదే కాంబినేషన్‌లో జీవా హీరోగా కవలై వేండాం (భయపడవద్దు) అనే చిత్రం చేయనున్నారు. త్వరలోనే సెట్‌పైకి రానున్న ఈ చిత్రం కోసం కథానాయకి అన్వేషణ జరుగుతోందని ఒక ముఖ్య పాత్రలో బాబి సింహా నటించనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఒక వినూత్న కథకు వినోదాన్ని జోడించి కవలైవేండాం చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు జీవా మరో చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారు. ఈ చిత్రానికి రాజారాణి ఫేమ్ అట్లీ కథను సిద్ధం చేయడం విశేషం. నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాయకిగా శ్రీ దివ్య నటించనున్నారు.