హిందీ ‘మిర్చి’ లో జాన్ అబ్రహాం

26 Jul, 2013 02:30 IST|Sakshi
హిందీ ‘మిర్చి’ లో జాన్ అబ్రహాం
ప్రస్తుతం బాలీవుడ్ చూపంతా టాలీవుడ్‌వైపే. తెలుగులో విజయం సాధించిన సినిమాలను రీమేక్ చేసేసి... తేలిగ్గా సక్సెస్ కొట్టేసే పనిలో అక్కడి నిర్మాతలు బిజీగా ఉన్నారు. పోకిరి, విక్రమార్కుడు, మర్యాదరామన్న, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి తెలుగు చిత్రాలు ఇప్పటికే బాలీవుడ్‌లో రీమేక్ అయ్యి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ఠాగూర్, స్టాలిన్ చిత్రాలతో పాటు, రవితేజ ‘కిక్’, రామ్ ‘కందిరీగ’ చిత్రాల కథలు కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. ఇంకా మరి కొన్ని విజయవంతమైన తెలుగు కథల వైపు బాలీవుడ్ నిర్మాతలు చూస్తున్నట్లు సమాచారం. 
 
 ఈ వరుసలోనే.... ఇటీవలే విడుదలై ప్రభాస్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘మిర్చి’ చిత్రం కథ బాలీవుడ్ తెరపై మెరవనుంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ని బాలీవుడ్ కండలవీరుడు జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు. త్వరలో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో హీరోగా తానే నటిస్తాడని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘విక్కీ డోనార్’ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా జాన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. మరి ఈ బాలీవుడ్ ‘మిర్చి’కి దర్శకుడెవరు? కథానాయికలు, సాంకేతిక నిపుణుల వివరాలేంటి? ఈ వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలిమరి.
>