ఆస్తులు పంచినట్టు క్రికెట్‌ ప్రేమను పంచారు : జూ.ఎ‍న్టీఆర్‌

3 Apr, 2018 17:16 IST|Sakshi
జూనియర్‌ ఎన్టీర్‌

అభిమాన క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌

ఫ్రాంచైజీ కొనే ఉద్దేశం లేదు

సాక్షి, హైదరాబాద్‌ : తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారని టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తెలుగు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్‌ మంగళవారం పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్‌ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు సరిహద్దులు లేవన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా క్రీడల్లోనే మాట్లాడుకోవచ్చని తెలిపారు. ఇక క్రికెట్‌ అయితే మన రక్తంలో చేరి నరనరాల్లో జీర్ణీంచుకుపోయిందన్నారు. పెద్ద వాళ్లు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను కూడా పంచారన్నారు.  చిన్నప్పుడు తన తండ్రితో క్రికెట్‌ మ్యాచ్‌లను చూసేవాడినని, తన తండ్రి ద్వారానే తనకు క్రికెట్‌పై ఇష్టం పెరిగిందన్నారు. ఈ ప్రేమను తాను తన కుమారుడికి సైతం పంచుతానని చెప్పారు. ప్రచారకర్తగా తనకు అవకాశం కల్పించిన స్టార్‌ యాజమాన్యానికి ఎన్టీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. స్టార్‌ మా రూపోందించిన ప్రచార వీడియోలో ఎన్టీఆర్‌ తెలుగు ఐపీఎల్‌ ప్రత్యేకత ఏమిటో వివరించారు. 

ఆ బయోపిక్‌లు నావల్ల కాదు
పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సచిన్‌ తన అభిమాన క్రికెటర్‌ అని, క్రికెటర్ల జీవితాలపై సినిమాలు రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే క్రికెటర్ల బయోపిక్స్‌ చేయడానికి తాను సాహసించనని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తనకు ఏ ప్రాంచైజీని కొనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు