బిహార్ బాలిక‌పై 'ఆత్మనిర్భ‌ర్' చిత్రం

30 Jun, 2020 19:09 IST|Sakshi

పాట్నా: లాక్‌డౌన్ కాలంలో గాయాల‌తో ఉన్న‌ త‌న తండ్రిని ఎక్కించుకుని 1200 కి.మీ. సైకిల్ తొక్కి ఇంటికి చేరుకున్న జ్యోతి కుమారి గాధ అప్ప‌ట్లో మార్మోగిపోయింది. అయితే ఈ ప్ర‌యాణం వెండితెర‌పై ఆవిష్కృతం కానుంది. దీన్ని ప్ర‌ధానంగా తీసుకుని 'ఆత్మ‌నిర్భ‌ర్' చిత్రం తెర‌కెక్కనుంది. ఇందులో జ్యోతి కుమారి స్వ‌యంగా న‌టించ‌నుండ‌టం విశేషం. దీనికి సంబంధించిన షూటింగ్ ఆగ‌స్టులో ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు విమేక్‌ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో జ్యోతి క‌థే కాకుండా ఆ బాలిక‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన‌ స‌మాజంలోని లోటుపాట్ల‌ను కూడా చూపించ‌నున్నామ‌ని సినిమా ద‌ర్శ‌కుడు షైన్ కృష్ణ అన్నారు. (ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ)

గుర్‌గావ్ నుంచి ద‌ర్భంగా వ‌ర‌కు ఆమె ప్ర‌యాణించిన ప్ర‌దేశాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ సినిమా హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కాగా లాక్‌డౌన్‌లో హ‌ర్యానాలోని గుర్‌గావ్లో తండ్రితో క‌లిసి నివ‌సిస్తోన్న జ్యోతిని ఇంటి య‌జ‌మానులు అద్దె క‌ట్టాలంటూ వేధించారు. దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుగోలు చేసింది. ఆ సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1200 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి బిహార్‌లోని స్వ‌స్థ‌లానికి చేరుకుంది. (ఆలయంలో నయన్‌-శివన్‌ల వివాహం!)

>
మరిన్ని వార్తలు