సినిమా: మరిది కార్తీ చిత్రంలో నటించడానికి నటి జ్యోతిక పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. కార్తీ నటించిన తాజా చిత్రం దేవ్ ఆయన్ని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఖైదీ అనే చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రెమో చిత్రం ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో నటించనున్నారు. తాజాగా మరో చిత్రానికి కార్తీ కమిట్ అయ్యారు. దీన్ని డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ మలయాళ దర్శకుడైన ఈయన ఇంతకు ముందు కమలహాసన్ కథానాయకుడిగా నటించిన పాపనాశం చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అయ్యారన్నది గమనార్హం.
ఈయన దర్శకత్వంలో తాజాగా కార్తీ హీరోగా నటించనున్న చిత్రంలో ప్రధాన పాత్రను నటి జ్యోతిక నటించనున్నట్లు తాజా సమాచారం.ఇందులో ఆమె పాత్ర కార్తీ పాత్రకు దీటుగా ఉంటుందని అంటున్నారు. హీరోయిన్, ఇతర నటవర్గం, సాంకేతిక బృందం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలంటున్నారు. అయితే ప్రస్తుతానికి కార్తీ మాత్రం ఎంపికయ్యారని, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని వారు చెబుతున్నారు. ఇకపోతే భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ నటించే చిత్రం కంటే ముందే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇది దర్శకుడు జీతూ జోసఫ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.