మా ఇద్దర్నీ కలిపింది తనే!

1 Jul, 2014 00:17 IST|Sakshi
మా ఇద్దర్నీ కలిపింది తనే!

 ఓ దర్శక దిగ్గజం మరో దర్శక ప్రముఖుని గురించి మాట్లాడితే... వినేకొద్దీ వినాలనిపిస్తుంది. ఒకరు కె. విశ్వనాథ్ అయితే, మరొకరు కె. బాలచందర్. ఇద్దరి ఇంటి పేర్లు కేతో ఆరంభమైనట్లుగానే, సినిమాల విషయంలోనూ ఇద్దరి అభిరుచులూ దాదాపు ఒకటే. కళాత్మక చిత్రాల నుంచి విభిన్న వాణిజ్య చిత్రాల వరకూ ఇద్దరూ సృష్టించిన సంచలనాలు ఎన్నెన్నో. ఈ ఇద్దరు దర్శకులూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే ‘ఉత్తమ విలన్’. కమల్‌హాసన్ హీరోగా నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
 
  కమల్‌తో ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’లాంటి ఆణిముత్యాలను విశ్వనాథ్ రూపొందిస్తే, బాలచందర్ ‘అవళ్ ఒరు తొడర్ కథై’, ‘అపూర్వ రాగంగళ్’ వంటి అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దర్నీ తన గురువులుగా భావిస్తారు కమల్. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఉత్తమ విలన్’లో ఉన్న రెండు కీలక పాత్రలను ఈ ఇద్దరూ చేస్తే బాగుంటుందని కమల్ భావించారు. స్వయంగా ఈ ఇద్దర్నీ సంప్రదించి, ఒప్పించారట. ఈ విషయాన్ని కె. విశ్వనాథ్ స్వయంగా చెప్పారు.
 
  ‘‘బాలచందర్, నేను బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఎక్కువసేపు కలిసి మాట్లాడుకోవాలనుకునేవాళ్లం. కానీ, కుదిరేది కాదు. ఒకరికొకరం సినిమా మేకింగ్ గురించి తెలిసిన విషయాలు పంచుకోవాలనుకునేవాళ్లం. కానీ, తీరిక లేక అది జరగ లేదు. ఇప్పుడు బాలచందర్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేటి తరం నటీనటులతో సినిమా చేయడంకూడా మంచి అనుభూతినిస్తోంది’’ అని విశ్వనాథ్ చెప్పారు.