కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

28 Aug, 2018 00:31 IST|Sakshi
విష్ణు బొప్పన, కె. విశ్వనాథ్, రోశయ్య

వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్‌ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్‌ అన్నారు. సీనియర్‌ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్‌ నటుడు గిరిబాబుకు ఆల్‌రౌండర్‌ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు.

బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్‌ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్‌ డి. సాయి శ్రీవంత్‌ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్‌ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు