'నా కూతురివి విషపూరిత వ్యాఖ్యలు.. క్షమించను'

19 Jan, 2016 16:46 IST|Sakshi
'నా కూతురివి విషపూరిత వ్యాఖ్యలు.. క్షమించను'

బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ, ఆయన కుమార్తె పూజాబేడీ మధ్య విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. కబీర్‌ బేడీ నాలుగో పెళ్లి చేసుకోవడంపై పూజాబేడీ బాహాటంగా విమర్శలు చేశారు. 70వ పుట్టినరోజున తన తండ్రి వివాహం చేసుకున్న పర్వీన్ దుసాంజ్‌ను 'మంత్రెగత్తె'గా, 'రాక్షసమైన సవతి తల్లి'గా అభివర్ణించారు. ట్విట్టర్‌లో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో పూజాబేడీ వాటిని ఉపసంహరించుకున్నారు. 70వ ఏట ఘనంగా తండ్రి చేసుకున్న నాలుగు పెళ్లికి ఆమె దూరంగా ఉన్నారు.

తండ్రీకూతుళ్ల మధ్య సత్సంబంధాలు లేని విషయం ఇది చాటుతున్నా.. తాజాగా కూతురు పూజాబేడీ తీరుపై కబీర్ బేడీ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేం పెళ్లి చేసుకున్న వెంటనే పర్వీన్ దుసాంజ్‌పై నా కూతురు పూజ చేసిన విషపూరిత వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. చెడు ప్రవర్తనను ఎంతమాత్రం క్షమించను' అంటూ ఆయన ట్వీట్ చేశారు.