ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం

16 Sep, 2016 02:55 IST|Sakshi
ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం

నటుడు ప్రకాశ్‌రాజ్ చేత బాగా దెబ్బలు తిన్నాం అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. నిక్కీగల్రాణి, ఆనంది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఆర్‌జే.బాలాజి జీవీకి స్నేహితుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మా క్రియేషన్స్ పతాకంపై టీ.శివ నిర్మిస్తున్నారు. ఇది ఈయన  నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. దీనికి రాజేశ్.ఎం దర్శకుడు. జీవీనే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం టీజర్ బుధవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
 
  చిత్ర టీజర్‌ను తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ తనకు సంగీత దర్శకుడిగా దశాబ్దం పూర్తి అయ్యిందన్నారు. అదే విధంగా ఈ చిత్ర నిర్మాత టీ.శివ 25 ఏళ్లుగా చిత్ర నిర్మాణ రంగంలో రాణిస్తున్నారన్నారు. దర్శకుడు రాజేష్ వద్ద 20 మందికి పైగా సహాయ దర్శకులు ఉన్నారని తెలిపారు. తన శిష్యులకు అవకాశాలను కల్పించే దర్శకుడు ఈయనని వ్యాఖ్యానించారు.
 
  రాజేష్ శిష్యులు పది మందికి పైగా తనకు కథలు చెప్పారని, వారందరికీ చిత్రం చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. నటి నిక్కీగల్రాణి, ఆనందిలిద్దరూ చాలా చ క్కగా నటించారని, ఆర్‌జే.బాలాజీ లెవలే వేరని అన్నారు. ఇందులో తాను ప్రకాశ్‌రాజ్‌తో తొలిసారిగా నటించానని తెలిపారు. ఆయనతో నటించడానికి చాలా భయపడేవాడినన్నారు. అందులోనూ ఆయన్ని తిట్టే సన్నివేశాలు చిత్రంలో చాలా ఉన్నాయని తెలిపారు.
 
 ఆయన తనను, ఆర్‌జే.బాలాజీని కొట్టే సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆ సన్నివేశాల్లో ప్రకాశ్‌రాజ్ నిజంగానే తమను కొట్టేశారని తెలిపారు. అలా ఆర్‌జే.బాలాజీ బాగా దెబ్బలు తిన్నారని జీవీ చెప్పారు. కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం మంచి విజయం సాధించి ఇందులో పనిచేసిన వారందరికీ మంచి పేరు తె చ్చి పెడుతుందనే  నమ్మకాన్ని  జీవీ.ప్రకాశ్‌కుమార్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మాత పీఎల్.తేనప్పన్, నాజర్, మనోబాలా, సంతానం, నిక్కీగల్రాణి, ఆనంది, తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై నిర్మాత టీ.శివ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.