కాజల్‌ కొత్త అవతారం

31 Mar, 2019 10:18 IST|Sakshi

సమాజసేవ చేస్తున్నానంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ఏమిటీ సడన్‌గా సమాజంపై ప్రేమ పుట్టుకొచ్చింది? కొంపదీసి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఉందా? ఏమిటి? అనే సందేహం కలగడంలో తప్పులేదు. అయితే దాని గురించి ప్రస్తావన కాజల్‌ తీసుకురాలేదు. పెళ్లి ఊసు ఎత్తితే ఈ జాణ సామాజిక సేవను తెరపైకి తీసుకొచ్చింది. ఈ అమ్మడికిప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ప్యారిస్‌ ప్యారిస్‌లో నటించింది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.

ఇక కమలహాసన్‌తో శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన కాజల్‌అగర్వాల్‌కు ఆ చిత్రం నిర్మాణంలో జాప్యం కాస్త నిరాశ పరుస్తోంది. ఇప్పుటికే ప్రారంభం కావలసిని ఇండియన్‌–2 చిత్రం కమలహాసన్‌ ఎన్నికల బరిలోకి దిగడంతో అవి పూర్తి అయ్యేవరకూ వేచి ఉండక తప్పనిపని. ఈ సందర్భంగా తన సినీ పయనం గురించి కాజల్‌ తెలుపుతూ తనను కలిసిన వారందరూ పెళ్లెప్పుడూ అని అడుగుతున్నారని, అయితే ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారిస్తున్నానని చెప్పింది.

అయితే పెళ్లి అనేది అందరికీ తెలిసేలానే చేసుకుంటానని అంది. తమిళంలో నటించిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నానని తెలిపింది. ఇటీవల యువ కథానాయకులతోనే నటిస్తున్నారేమిటని అడుగుతున్నారని, అయితే ఎవరితో నటిస్తున్నాను అన్నదానికంటే ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నానన్నదే ముఖ్యం అని చెప్పింది. మంచి కథ, పాత్ర అయితే ఏ నటుడితోనైనా నటించడానికి సిద్ధం అని పేర్కొంది. ప్రస్తుతం తాను సామాజిక సేవపై దృష్టి పెట్టినట్లు చెప్పింది.

అందుకు తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రాలోని అరకు అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ఆదివాసుల పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేక అవస్థలు పడడం చూశానని, దీంతో నిధిని సేకరించి ఆ ప్రాంతంలో పాఠశాలను కట్టించినట్లు కాజల్‌అగర్వాల్‌ తెలిపింది. తాను మంచి విషయాల గురించే మాట్లాడతానని అంది. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, అలాంటి వారిని ప్రోత్సహించడం తప్పేనని కాజల్‌ అంటోంది.

మరిన్ని వార్తలు