అందుకు నేనింకా సిద్ధం కాలేదు!

8 Dec, 2018 11:34 IST|Sakshi

సినిమా: అందుకు నేనింకా సిద్ధమవలేదు అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌తో జత కట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక తెలుగులో నటించిన కవచం చిత్ర రిజల్ట్‌ కోసం ఆతృతగా చూస్తోంది. ఈ ఏడాది తన కెరీర్‌ గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చింది. ఇంతకుముందు సీనియర్‌ హీరోలతో నటించిన నేను ఇప్పుడు యువ హీరోలతో జత కట్టడం యాదృశ్చికమే. నేను మాత్రం కథ పాత్రలకే ప్రాముఖ్యత నిస్తున్నాను. అయితే ఒకే మాదిరి పాత్రల్లో నటించి బోర్‌ కొడుతోంది. అందుకే ఇకపై అలా నటించాలనుకోవడం లేదు. అయితే తెలుగు చిత్రం కవచం కమర్శియల్‌ అంశాలతో కూడిన చిత్రం కావడంతో నేనూ ఆ తరహాలోనే నటించాల్సి వచ్చింది.

వెబ్‌ సిరీస్‌లో చాన్స్‌: వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. అయితే అందులో నటించడానికి నేను తయారవలేదు. కారణం కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి నేను మానసికంగా సిద్ధం అవలేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి సీరీస్‌లో నటించడానికి భయపడ్డాను. అయితే ఇప్పుడు నాలో తెగింపు వచ్చింది. కొత్తగా చేయాలని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాను. ఈ ఏడాది నా కెరీర్‌ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. అయితే వ్యక్తిగతంగానే అలా లేదు. ఈ ఏడాది ప్రారంభంలో అనారోగ్యానికి గురయ్యాను. మూడు నెలలు బెడ్‌కే పరిమితం అయ్యానంటే మీరు ఆశ్చర్యపోతారు. నటనకు బ్రేక్‌ తీసుకుందామనిపించింది. అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుందామని భావించాను. నేను ఆటో ఇమ్యూన్‌ డిజాస్టర్‌ అనే వ్యాధికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. చాలా నీరసించిపోయాను. దీంతో నటనకు విరామం తీసుకోవాలని తలచినా కుదరలేదు. వరుసగా చిత్రాలను కమిట్‌ అవడమే అందుకు కారణం. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నానని నటి కాజల్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చింది

మరిన్ని వార్తలు