నయన్‌ చిత్ర సీక్వెల్‌లో కాజల్‌

11 Sep, 2018 10:12 IST|Sakshi

నయనతార చిత్ర సీక్వెల్‌లో నటించే అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించిందనే వార్త వైరల్‌ అవుతోంది. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న హీరోయిన్‌ నయనతార. ఈ అమ్మడికి వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి. పారితోషికం భారీగానే ఉన్న నయన చుట్టూనే అవకాశాలు తిరుగుతున్నాయి. ఇక కాజల్‌ అగర్వాల్‌ అగ్ర కథానాయికల పట్టికలో ఉన్నా, ప్రస్తుతం అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. ఎందుకో గానీ టాలీవుడ్‌లో ఉన్నంత క్రేజ్‌ ఈ అమ్మడికి కోలీవుడ్‌లో రాలేదు.

విజయ్,  అజిత్, కార్తీ, విశాల్‌ లాంటి స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసినా అంతగా స్టార్‌డమ్‌ను పొందలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో ప్యారీస్‌ ప్యారీస్‌ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాని కథానాయకిల లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అయినా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించని కాజల్‌కు కోలీవుడ్‌లో తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ తలుపుతట్టినట్లు సమాచారం.

ఇంతకు ముందు జయంరవి హీరోగా తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం తనీఒరువన్‌. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఇందులో నయనతార కథానాయకి. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఇటీవల అధికారిక పూర్వకంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో జయంరవికి జంటగా ఇద్దరు భామలు నటించనున్నారని, అందులో మొదటి భాగంలో నటించిన నయనతారనే నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

మరో నాయకిగా నటి సాయోషాసైగల్‌ నటించే అవకాశం ఉన్నట్లు, ఇక అరవిందస్వామి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో నయనతారకు బదులు నటి కాజల్‌ అగర్వాల్‌ను నటింపజేసే పనిలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలిసింది.

ఇక సాయేషాసైగల్‌ విషయంలో ఎలాంటి మార్పు లేకపోయినా, తనీఒరువన్‌ పార్టు 1లో విలన్‌గా విజృంభించిన అరవిందస్వామినే పార్టు 2లోనూ నటింపజేయాలని చిత్ర దర్శక నిర్మాతలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.

>
మరిన్ని వార్తలు