ఆ ఒక్కటీ అడగొద్దు

9 Jun, 2017 02:40 IST|Sakshi
ఆ ఒక్కటీ అడగొద్దు

ఆ ఒక్కటీ అడగొద్దు అంటోంది బాలీవుడ్‌ భామ కాజోల్‌. ఒకప్పుడు బాలీవుడ్‌లో కలలరాణిగా యువతను గలిగింతలు పెట్టిన కాజోల్‌ మిన్సారకణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 1997లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించి కాజోల్‌ను కోలీవుడ్‌ గుర్తుంచుకునేలా చేసింది. కాగా 30ఏళ్ల తరువాత తాజాగా నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ–2 చిత్రంలో మెరవనుంది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.

ఈ చిత్రానికి రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య దర్శకురాలు. కాగా వీఐపీ–2లో నటించి భర్తతో కలిసి మాల్‌దీవులకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్న కాజోల్‌ వీఐపీ–2 చిత్రంలో మీ పాత్ర ఏమిటమ్మా అన్న ప్రశ్నకు టక్కున ఆ ఒక్కటీ అడగొద్దు అని అంది. ఏం అంత గోప్యంగా ఉంచుతున్నారు? అని అడగ్గా వీఐపీ–2 చిత్రం గురించి గాని, అందులో తన పాత్ర గురించి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టొద్దని ఆ చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ షరతులు విధించారని చెప్పింది. అయితే ఇందులో ఈ భామ ప్రతినాయకురాలిగా నటించిందనే ప్రచారం మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.