నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్న హీరోయిన్

6 Jun, 2016 15:21 IST|Sakshi
నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్న హీరోయిన్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన అందమైన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకుంది. ఇదివరకు హిందీలో సింగం, స్పెషల్ 26 సినిమాల్లో మెరిసిన కాజల్ బాలీవుడ్లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనుంది. రణదీప్ హూడా సరసన ఆమె నటించిన 'దో ల‌ఫ్జోంకీ క‌హానీ'  చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్ తొలిసారి అంధురాలిగా కనిపించనుంది. చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఆ పాత్ర చేశానని చెబుతోంది కాజల్. ఆ పాత్రను సహజంగా పండించేందుకు అంధులైన విద్యార్థులను కలిసింది. పలువురు అంధులతో కలిసి పనిచేసింది. వారిని దగ్గరగా గమనించిన కాజల్.. మరణానంతరం తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకుంది.

చిన్న చిన్న పనులకు కూడా ఎంత కష్టపడాలో అంధులను దగ్గరగా చూసిన తర్వాతే తెలిసిందని, అంధురాలి పాత్ర తనలో మార్పు తీసుకొచ్చిందని అంటోంది కాజల్. చూపు విలువ తెలిసొచ్చిందని.. అందుకే తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే ఆమెతో నటించిన హీరో రణదీప్ హూడా కూడా తన కళ్లను దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు.

కాగా అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో నాగార్జున, అమల దంపతులు అవయవ దానం విషయంలో నిర్ణయం తీసుకోగా, బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, సల్మాన్ కాన్, ఆమీర్ ఖాన్లు ముందున్నారు.