సాధారణంగా అబ్బాయిలు తల్లికి అతుక్కుపోతే అమ్మాయిలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవ్గన్, కాజోల్ జోడీ విషయంలో ఇది కాస్త తారుమారైనట్టు కనిపిస్తోంది. తాజాగా కాజోల్ ఓ షోలో మాట్లాడుతూ.. తన పదహారేళ్ల కూతురు నైసా ఏ విషయాన్నైనా తనతో చెప్పుకోడానికే ఇష్టపడుతుందని తెలిపింది. తనకు ఎదురయ్యే సమస్యలను కానీ, బాయ్ఫ్రెండ్స్ గురించి కానీ తండ్రి దగ్గర అసలు ప్రస్తావించదని చెప్పుకొచ్చింది.
ఎందుకంటే ఆ మరుక్షణమే అజయ్ తుపాకీ పట్టుకుని బయలుదేరుతాడంది. కొడుకు యగ్ మాత్రం చిన్న సలహాకైనా తండ్రి దగ్గరికే పరుగెత్తుకెళ్తాడని పేర్కొంది. అజయ్ ఆవేశపడుతాడు కానీ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడంది. ఇక పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ తాను పిల్లలను ఎప్పుడూ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూడలేదని, ఓ పరిధి మేరకు వారే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానంది. కాగా ‘గూండా రాజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో అజయ్ దేవ్గన్, కాజోల్ మధ్య ప్రేమ చిగురించగా 1999లో ఫిబ్రవరి 24న పెళ్లిబంధంతో వాళ్లిద్దరూ ఒక్కటైన విషయం తెలిసిందే.