తొలిసారిగా బుల్లితెర మీద నటిస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపారు. బిగ్బాస్ కార్యక్రమం ద్వారా తానేమీ డౌన్ కాలేదన్నారు. హాలీవుడ్, బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన బిగ్బాస్ గేమ్ షో తాజాగా కోలీవుడ్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. ఆదివారం నుంచి విజయ్ టీవీలో ప్రసారం కానున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కమలహాసన్ విలేకరుల సమావేశంలో ముచ్చటించారు.
ఈ సందర్భంగా తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే తొలిసారి అని తెలిపారు. వెండితెర మీద ఎన్నో విజయాలు సాధించిన కమల్, బుల్లితెరపై కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్వవహరించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని, ఈ గేమ్షోలో పాల్గొనే 14 మంది సెలబ్రిటీలు ఎవరన్నది తనకు తెలియదని, అందరి మాదిరిగానే తాను వారెవరన్నది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు.