మధ్యాహ్నం వరకు షూటింగ్, ఆ తరువాత పార్టీ కార్యక్రమాలు
చెన్నై , పెరంబూరు: నటన, రాజకీయం. ఈ జోడు గుర్రాలపై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ స్వారీ చేస్తున్నారు. ఈయన గతేడాది జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. గ్రామ సభలు, బహిరంగ సభలు అంటూ ఎక్కువగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాధికారుల అవినీతిపై స్పందిస్తున్నారు. యువతను రాజకీయాల్లోకి రావాలంటూ ప్రోత్సహిస్తున్నారు.
నటుడిగానూ అదే పంథా
రాజకీయాల్లో దృష్టి పెడుతూనే కమల్ మరోపక్క నటనపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రం చేస్తున్నారు. ఆయనకు జంటగా నటి కాజల్అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం గత 18వ తేదీన ప్రారంభం అయ్యి నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించిన కమలహాసన్ ఇండియన్–2 చిత్రం తన రాజకీయాలకు ఉపయోగపడేలా చూసుకుంటున్నారు. ఈయన సేనాధిపతిగా అవినీతిపై నిర్విరామంగా పోరాడిన పాత్రలో నటించిన ఇండియన్ చిత్రం 22 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చి ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దర్శకుడు శంకర్ 2.ఓ చిత్రం తరహాలోనే అంతర్జాతీయ సమస్యను ప్రధానాంశంగా తీసుకున్నట్లు సమాచారం.
మేకప్కే 3 గంటలు
ఇండియన్–2 చిత్రంలోని సేనాధిపతి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాత్ర కోసం కమలహాసన్ షూటింగ్ 10 గంటలకైతే ఉదయం 6 గంటలకే షూటింగ్కు వచ్చి 9 గంటల వరకూ అంటే మూడు గంటల పాటు మేకప్కు టైమ్ కేటాయిస్తున్నారట. ఆయన నటించిన ప్రతి సన్నివేశాన్ని కెమెరా వ్యూలో చూసుకుని సంతృప్తికరంగా లేకపోతే మళ్లీ నటిస్తున్నారట. ఆయన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ తరువాత శంకర్ ఇతర నటీనటులతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అక్షయ్ విలన్ కాదు
ఇండియన్–2 చిత్రంలో 2.ఓ చిత్రం ఫేమ్ అక్షయ్కుమార్ విలన్గా నటించబోతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రం కోసం ఆయన్ని సంప్రదించిన మాట వాస్తవమే అయినా, కమల్కు ఆయనకు మధ్య కాల్షీట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆయన నటించడం లేదని తెలిసింది. ఇప్పుడు ఆ పాత్రకు మరో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం
ఉదయం ఇండియన్–2 చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న కమలహాసన్ మధ్యాహ్నం నుంచి రాజకీయ పనులకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అలా రాత్రి 10 గంటల వరకూ పార్టీకి సంబంధించిన పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇలా రోజుకు 16 గంటలు ఆయన శ్రమిస్తున్నారు. ఇలా జోడు గుర్రాల పయనం చేస్తున్న కమలహాసన్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయగలరా? అన్న సందేహం రావచ్చు. అయితే అందుకు పార్టీ నిర్వాహకులను, కార్యకర్తలను కమలహాసన్ సన్నద్ధం చేస్తున్నారనీ, కచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.