'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'

26 Feb, 2020 09:01 IST|Sakshi

చెన్నై : విలక్షణ నటుడు, తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ ఈ మధ్యన వివాదాల్లో నిలుస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న​ సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సీనియర్‌ హీరోయిన్‌ రేఖకు కమల్‌ క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పేర్కొనడం  ఆసక్తిని రేకెత్తించింది. వివరాలు.. కె. బాల చందర్‌ దర్శకత్వంలో 1986లో 'పున్నగై మన్నన్‌' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, రేఖల హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా సినిమాలో కమల్‌, రేఖల మధ్య ఒక ముద్దుసన్నివేశం ఉంటుంది. అయితే రేఖ16 ఏళ్ల వయసులో ఆమె అనుమతి లేకుండానే సినిమాలో ఈ సన్నివేశం చిత్రీకరించినట్లు తెలిసింది. (కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌లకు పోలీసు నోటీసులు)

ఇదే విషయమై సీనియర్‌ నటి రేఖ స్పందిస్తూ.. ' నేను ఈ విషయాన్ని ఇప్పటికే వంద సార్లు చెప్పాను. డైరెక్టర్‌ బాలచందర్‌ నాకు తెలియకుండానే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడానికి విసుగు అనిపిస్తుంది. కథలో బావోద్వేగం నింపడం కోసం ముద్దు సన్నివేశం పెట్టినట్లు ఆ షాట్‌ చిత్రీకరణ తర్వాత నాకు చెప్పారు. కాగా షూటింగ్‌ ముగిసిన తర్వాత అప్పటి అసోసియేట్‌ డైరెక్టర్‌లుగా ఉన్న సురేశ్‌ కృష్ణ, వసంత్‌ల దగ్గర ముద్దు విషయం తన అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరించారని అడిగాను. దానికి వారు ఒక చిన్న పిల్లను ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదు.. అయినా ఈ సీన్‌కు సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం తెలుపుతుందని వారంటే.. సెన్సార్‌ అంటే ఏమిటని అడిగినట్లు నాకు గుర్తుంది. కాగా ఆ షాట్‌ ముగిసిన తర్వాత డైరెక్టర్‌ బాలచందర్‌, కమల్‌ హాసన్‌లు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అయితే సినిమా రిలీజ్‌ అయి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాకు మంచి అవకాశాలు రావడంతో ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు' అంటూ వెల్లడించారు.
(కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్‌)

తాజాగా సోషల్‌ మీడియాలో మరోసారి ఈ విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ' ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్‌  కె.బాలచందర్‌ మన మధ్య లేరు. కమల్‌ హాసన్‌తో పాటు సినిమా యూనిట్‌ మాత్రమే ఉన్నారు. అయినా వారికి క్షమాపణ చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు.. లేదంటే లేదు. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన విషయం. మళ్లీ ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడం నాకు ఇష్టం లేదు' అని రేఖ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు