ఆ ముద్దుగుమ్మ మధుశాలినే!

10 Jun, 2015 01:11 IST|Sakshi
ఆ ముద్దుగుమ్మ మధుశాలినే!

 చాలా కాలం తరువాత కమలహాసన్ నేరుగా తెలుగులో నటిస్తున్న కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’. తెలుగు, తమిళాల్లో (తమిళ టైటిల్ ‘తూంగావనమ్’) ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాలో కమలహాసన్ సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమవడాని కన్నా ముందే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మీడియా మీట్‌లో కమలహాసన్ స్వయంగా విడుదల చేశారు. తుపాకీ పట్టుకొని, ముఖం కనిపించని ఒకమ్మాయిని గాఢంగా ముద్దాడుతున్న కమల్ లాంటి ఫోటోలన్నీ ఈ ‘థ్రిల్లర్’ పట్ల ఆసక్తి పెంచాయి. ఇంతకీ ఆ బొమ్మలో ముద్దిస్తున్న అమ్మాయి ఎవరని చర్చ జరిగింది.
 
  ఆ నటి ఎవరన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ, త్రిష కావచ్చేమో అని ఊహాగానాలు రేగాయి. అయితే, ఆ నటి మరెవరో కాదు... మన తెలుగమ్మాయి మధుశాలిని అని తేలింది. కూచిపూడి నర్తకి, ఇ.వి.వి. ‘కితకితలు’ దగ్గర నుంచి ఇటీవలి ‘గోపాల... గోపాల’ దాకా పలు చిత్రాల్లో నటించిన వర్ధమాన కథానాయిక మధుశాలిని ఈ సినిమాతో బంపర్ ఛాన్స్ కొట్టేశారు. తమిళంలో విశాల్, ఆర్యల ‘అవన్ - ఇవన్’లోనూ నటించిన మధుశాలినికి ఇది పెద్ద ఆఫరనే చెప్పాలి. ఈ ముద్దు సీన్ ఫస్ట్‌లుక్‌లో ముఖంగా కనిపించకుండా ఆసక్తి రేపిన ఆమెది ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర.
 
  ఇప్పటికే కొన్ని రోజుల షూటింగ్‌లోనూ ఆమె పాల్గొన్నారు. థ్రిల్లర్ సినిమా కావడంతో అంతకు మించి వివరాలు ఎవరూ వెల్లడించడం లేదు. కమలహాసన్, త్రిష, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని తదితర ముఖ్య తారాగణమంతా పాల్గొనగా, ఇప్పటికి దాదాపు పది రోజులుగా హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ‘‘మరో రెండు, మూడు రోజులు ఇక్కడే షూటింగ్ సాగుతుంది. తరువాయి షెడ్యూల్ చెన్నైలో ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే షార్ట్‌ఫిల్మ్ ‘సీతావలోకనం’లో సీతగా అందంగా కనిపించిన మధుశాలినికి ఇటు తెలుగు, అటు తమిళాల్లో వచ్చే ఈ పెద్ద సినిమాతో బ్రేక్ వస్తుందేమో!