దీపావళికి భయపెట్టే ‘కణం’

4 Sep, 2017 01:32 IST|Sakshi
దీపావళికి భయపెట్టే ‘కణం’

ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద’ సినిమాలతో యువతలో మంచి పేరు తెచ్చుకున్న హీరో నాగశౌర్య. తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన హీరోయిన్‌ సాయిపల్లవి. వీళ్లిద్దరూ జంటగా నటించిన సినిమా ‘కణం’. విజయ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘విభిన్న కథతో తెరకెక్కిన చిత్రమిది. రజనీకాంత్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో మా సంస్థ నిర్మిస్తున్న ‘2.0’ సిన్మాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ ‘కణం’కి పని చేశారు’’ అని లైకా సంస్థ తెలిపింది. హారర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని సమాచారం. ‘పెళ్లిచూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌. ప్రేమ్‌.