చెన్నైలో సందడి చేసిన కంగనా

6 Jan, 2019 09:09 IST|Sakshi

బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ శుక్రవారం చెన్నైలో సందడి చేసింది. ఈ బ్యూటీ నటించిన మణికర్ణిక చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. ఝాన్సీరాణి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణతో కలిసి నటి కంగనారనౌత్‌ దర్శకత్వం వహించడం విశేషం.  కథను తెలుగు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ అందించారు. మణికర్ణిక చిత్రాన్ని హిందీ తోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అనువదించి విడుదల చేయనున్నారు. జీ.స్టూడియోస్‌ సంస్థతో కలిసి కమల్‌ జైన్‌ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్ర తమిళ వెర్షన్‌ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని సత్యం సినీ థియేటర్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత కమల్‌జైన్‌తో పాటు నటి కంగనారనౌత్‌ పాల్గొన్నారు. కంగనారనౌత్‌ మాట్లాడుతూ దేశానికి సంబంధించిన కథలో నటించలేదే అని 12 ఏళ్లుగా బాధపడుతున్నానంది. దేశ సినీపరిశ్రమలోనే ప్రముఖులైన విజయేంద్రప్రసాద్, డేనీ డెంజొప్ప, అతుల్‌ కులకర్ణి వంటి వారితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు నా బరువు 50 చాలా తక్కువని. సన్నగా ఉండడంతో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు తన ఆంగీకం నప్పలేదని స్టంట్‌ దర్శకుడు కూడా చెప్పారని అంది.

అదేవిధంగా రోజూ 10 నుంచి 12 గంటల వరకూ యాక్షన్‌ సన్నివేశాల్లో నటించాల్సిన పరిస్థితి అని చెప్పింది. అలా చాలా శ్రమపడి ఈ చిత్ర యాక్షన్‌ సన్నివేశాల్లో నటించానని చెప్పింది. ఆ తరువాతనే తాను ఈ చిత్రంలోని డ్రామా సన్నివేశాలకు దర్శకత్వం వహించానని తెలిపింది. అప్పుడు తాను చాలా సమయాన్ని రచయితతో గడిపానని చెప్పింది. అది దర్శకత్వం వహించడానికి చాలా దోహదపడిందని అంది. అయితే తాను నటించాల్సిన సన్నివేశాల చిత్రీకరణకు చాలా సవాల్‌ అనిపించిందని పేర్కొంది. రాణి లక్ష్మీబాయ్‌ పాత్రలో నటించడం సాధారణ విషయం కాదని ఈ పాత్రలో నటించడానికి తనకు చాలా నమ్మకం, అంకితభావం అవసరమైందని అంది.

మరిన్ని వార్తలు