జేఎన్‌యూ: దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు

17 Jan, 2020 15:02 IST|Sakshi

సాక్షి, ముంబై : జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను దీపికా పదుకొనేను విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. ఘటన జరిగి పదిరోజులకు పైగా కావస్తున్నా.. ఆమెపై కామెంట్లు ఏమాత్రం తగ్గడంలేదు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దీపికపై విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ జేఎన్‌యూలో దీపిక పర్యటించడంపై స్పందించారు. ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ ఆమెకు  ఉందని, కానీ నేను మాత్రం తుక్డే గ్యాంగ్‌ వెనుక నిల్చునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా ప్రధాన పాత్రలో నటించిన పంగా మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మూవీ ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం ఆమె ఓ మీడియాతో ముచ్చటించారు. (నువ్వు ఎవరికి మద్దతిస్తున్నావో తెలుసా!)

ఈ సందర్భంగా జేఎన్‌యూలో జరిగిన హింసలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు దీపిక వెళ్లిన అంశంపై ఆమె స్పందించారు. ‘దీపిక ఏం చేసిందో. ఏం చేయబోతుందో. వాటిపై నేనే మాట్లాడలేను. ఏమైనా చేయగల హక్కు ఆమెకు ఉంది. కానీ నేను మాత్రం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే దేశద్రోహులకు మద్దతు తెలపను. జవాన్లు మరణిస్తే.. సంబరాలు చేసుకునే వారితో చేతులు కలపను. దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నే తుక్డే గ్యాంగ్‌ వెనుక నిల్చునో’ అని చెప్పుకొచ్చారు. ఛపాక్ సినిమాపై బాయ్ కాట్ ప్రకటించడంపై మాట్లాడుతూ.. మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరని, ఎవరో బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏమి జరగదని చెప్పుకొచ్చింది.  అయితే ఆమె మాట్లాల్లో దీపిక చర్యను పరోక్షంగా తప్పుపట్టినట్లే అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు