నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే: కంగనా

8 Jan, 2020 16:34 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘పంగా’. ఇందులో మాజీ మహిళా కబడ్డీ చాంపియన్‌ జయ పాత్రను కంగనా పోషిస్తోంది. తాజాగా ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. తన పెళ్లి గురించి మనసులో మాటను బయటపెట్టింది. కంగనా మాట్లాడుతూ.. ‘తొలుత పెళ్లంటేనే చేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. దీనికి పంగా దర్శకురాలు అశ్విని అయ్యర్‌, ఆమె భర్త నితేశ్‌ తివారి ప్రధాన కారణం. వీళ్లిద్దరి మధ్య అన్యోన్యత, ప్రేమను చూసిన తర్వాత పెళ్లిపై నాకున్న చెడు అభిప్రాయం పూర్తిగా చెరిగిపోయింది. నితేశ్‌ తివారి, తన భార్యకు ఎంతో సపోర్ట్‌ చేస్తాడు. వాళ్లను చూశాక నాకూ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది’ అని చెప్తూ సిగ్గుల మొగ్గయింది.

తనకు కాబోయే భర్తకు ఎలాంటి గుణగణాలు ఉండాలో కూడా కంగనా వివరించింది. తనను చేసుకునే అబ్బాయి అందం, తెలివితేటలు అన్నింటిలోనూ తనకన్నా ఓ మెట్టు ఎక్కువే ఉండాలంది. అలాంటి వాడితోనే మూడు ముళ్లు వేయించుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో కంగనా ఈ ఏడాది పెళ్లిపీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా పంగా చిత్రంలో కంగనా కబడ్డీ ప్లేయర్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. ఆమె ఆశయానికి భర్త కూడా సహకరిస్తాడు. రిచా చద్దా, పంకజ్‌ త్రిపాఠిలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను కంగనా సోదరి రంగోలి చందేల్‌ తన తల్లి ఆశా రనౌత్‌కు అంకితం చేస్తున్నానని తెలిపారు.

చదవండి:
ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌
కంగనా రనౌత్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు