నేనూ రాజ్‌పుత్‌నే..

18 Jan, 2019 16:03 IST|Sakshi

సాక్షి, ముంబై : ఝాన్సీ లక్ష్మీబాయ్‌ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికను వివాదాలు వెంటాడుతున్నాయి. మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌కు ఓ బ్రిటిష్‌ అధికారితో సంబంధం ఉన్నట్టు చూపే సన్నివేశంతో పాటు ఆమె నృత్యం చేసే సన్నివేశం పట్ల కర్ణిసేన ఆక్షేపిస్తోంది. కాగా, ఈ సినిమాలో టైటిల్‌ పాత్రలో నటించడంతో పాటు కొద్ది భాగానికి దర్శకత్వ బాధ్యతలూ చేపట్టిన కంగనా రనౌత్‌ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

మణికర్ణికపై వరుస వివాదాలు ముసురుకోవడం పట్ల ఆమె భగ్గుమన్నారు. ఈ సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి ధ్రువీకరించారని, తాము సెన్సార్‌ సర్టిఫికెట్‌ను కూడా పొందామని కంగనా చెప్పుకొచ్చారు.ఈ దశలో సినిమాపై కర్ణిసేన అభ్యంతరంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణిసేనకు పరిస్థితిని తాము వివరించినా వారు తనను వేధించడం కొనసాగిస్తున్నారని, దీన్ని వారు విరమించకపోతే తానూ రాజ్‌పుత్‌నే అన్న విషయం వారు గుర్తెరగాలని, వారెవరినీ తాను విడిచిపెట్టనని హెచ్చరించారు. మణికర్ణిక మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు