‘కరణ్‌ వాళ్ల గురించే మాట్లాడతారు’

26 Feb, 2019 20:15 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి ఈసారి దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ను టార్గెట్‌ చేశారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఆయన ఉత్తమ హీరోయిన్ల లిస్ట్‌లో కంగన పేరును ప్రస్తావించకపోవడంపై రంగోలి మండిపడ్డారు. గతంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో కరణ్‌ బెస్ట్‌ హీరోయిన్‌ ఎవరంటూ కొందరి పేర్లు చెప్పారు. అయితే వారిలో కంగనా పేరు లేదు. దాంతో ఓ నెటిజన్‌ కరణ్‌ను ఉద్దేశిస్తూ ‘ఆలియా భట్‌, దీపికా పదుకొణె, అనుష్క శర్మ.. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో రాపిడ్ ఫైర్‌‌లో ఉత్తమ నటీమణుల జాబితాలో కంగన లేరు. ఎందుకంటే కంగన వీళ్లందరి కన్నా ఉత్తమ నట అని కరణ్‌కు ముందే తెలుసు. అంతేగా కరణ్‌?’ అని సోషల్‌మీడియాలో ట్వీట్‌ చేశారు.

దీన్ని చూసిన రంగోలి కరణ్‌ బంధుప్రీతి చూపిస్తారని విమర్శించారు. ‘మూవీ మాఫియా అంటే ఇదే. కరణ్ జోహార్‌ పలు జాతీయ అవార్డులు అందుకున్న నటి గురించి మాట్లాడరు. ఆయన పరిచయం చేసిన బంధువుల పిల్లల గురించి మాత్రమే మాట్లాతారు’ అని రంగోలి ఎద్దేవా చేశారు. కంగన కూడా ఇటీవల నటి ఆలియా భట్‌ను విమర్శించారు. ఆమె కరణ్‌ చేతిలో కీలుబొమ్మలా మారారని, ఆయన చెప్పిందే చేస్తుంటారని ఆరోపించారు. దీనికి ఆలియా స్పందిస్తూ.. కంగన ఆ రీతిలో వ్యాఖ్యలు చేసేలా తను ఎప్పుడూ ప్రవర్తించలేదని అన్నారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చర్చించుకుంటామని, అంతేకానీ దీని గురించి మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు