ఇంటికెళ్లాల‌ని ఉంది: క‌నికా క‌పూర్‌

30 Mar, 2020 14:29 IST|Sakshi

క‌రోనాతో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ సింగ‌ర్ క‌నికా క‌పూర్ త‌న‌కు ఇంటికెళ్లాల‌నుంద‌ని భావోద్వేగానికి లోనైంది. పిల్ల‌ల‌ను, కుటుంబాన్ని ఎంత‌గానో మిస్ అవుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. ఈమేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇప్ప‌టికే ఈ సింగ‌ర్‌కు నాలుగు సార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ప్ర‌తిసారీ క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈసారి టెస్ట్‌లోనైనా నెగెటివ్ రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొంది. "జీవితం స‌మయాన్ని ఎలా వాడుకోవాలో నేర్పిస్తే, స‌మ‌యం జీవితం విలువ‌ని బోధిస్తుంది" అని రాసి ఉన్న ఇమేజ్‌ను అభిమానుల‌తో పంచుకుంది. త‌న‌పై ఎంత‌గానో ప్రేమ‌ను కురిపించిన ప్ర‌తి ఒక్క‌రికీ కృతజ్ఞ‌త‌లు తెలిపింది. ప్ర‌స్తుతం తాను ఐసీయూలో లేన‌ని, త‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. 

అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. మ‌రోవైపు క‌నికాను క‌రోనా వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మెరుగైన చికిత్స కోసం విదేశాల‌కు త‌ర‌లిద్దామ‌న్నా వీలులేకుండా ఉంద‌ని, ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించ‌డం ఒక్క‌టే త‌మ ముందున్న ఏకైక మార్గ‌మ‌ని వారు పేర్కొంటున్నారు. కాగా మార్చి 9న లండన్‌ నుంచి తిరిగివచ్చిన కనికా కపూర్‌ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. అదే సమయంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో క‌ల‌క‌లం రేగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స తీసుకుంటోంది. (నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం)

మరిన్ని వార్తలు