సాక్షి, బెంగళూరు: కన్నడ యువ నటుడు, ‘పప్పుసీ కామెడీ’ ఫేం రాకేశ్(27) మంగళవారం మృతి చెందారు. కన్నడ సినిమా పరిశ్రమలో ‘బుల్లీ’గా సుపరిచితుడైన ఆయన కోరమంగలలో ఉన్న సెయింట్జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్యాంగ్రిన్ వ్యాధితో బాధపడుతున్న రాకేశ్ రెండు నెలలక్రితం శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో ఆయన సెయింట్జాన్స్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.
చెలువినచిత్తార చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమైన రాకేశ్ పలు కన్నడ సినిమాల్లో ప్రతిభను కనబరిచారు. రాకేశ్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేశ్ కూడా నటులే. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజాచిత్రం ‘ధూమపాన’ షూటింగ్ పూర్తికావొచ్చింది. రాకేశ్ మృతికి పలువురు నటులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.