వాళ్లుండగా నేనెందుకని వెళ్లలేదు: కమెడియన్‌

5 Jun, 2019 20:54 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌​ ఫేమస్‌​ కామెడీ షో ‘‘ది కపిల్‌ శర్మ షో’’ గురించి తెలియని వాళ్లుండరు. కపిల్‌ శర్మ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ఎంతో ప్రజాధరణ పొందింది. అయితే షోలో నటించిన సునీల్‌ గ్రోవర్‌కు కపిల్‌ శర్మకు విభేదాలు తలెత్తడంతో షో మూసుకోవాల్సి వచ్చింది. షో ఆగినా కపిల్‌, సునీల్‌ల మధ్య యుద్ధం మాత్రం ఆగలేదు. ట్విటర్‌ వేదికగా ఒకరినొకరు తెగ విమర్శించుకున్నారు. అప్పట్లో వీరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఉండేది పరిస్థితి. ప్రస్తుతం వేడి వాతావరణం కొద్దిగా చల్లబడినట్టుగానే అనిపిస్తోంది. సునీల్‌ గ్రోవర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కపిల్‌ చేసిన ఓ ట్వీట్‌.. దానికి సునీల్‌ స్పందన రెండూ ఇప్పుడు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కపిల్‌ శర్మ చాలా రోజుల తర్వాత ‘‘ది కపిల్‌ శర్మ షో సీజన్‌2’’ పేరిట తన షోను పునప్రారంభించిన సంగతి తెలిసిందే.

కాగా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన భారత్‌ సినిమాలో సునీల్‌ లీడ్‌ రోల్‌లో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్‌ నిమిత్తం సల్మాన్‌, కత్రినాలు కపిల్‌ శర్మ షోకు హాజరయ్యారు. ఈ బుధవారం సినిమా రిలీజ్‌​ కానున్న సందర్భంగా చిత్రబృందానికి కపిల్‌ శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్‌, కత్రినా, సునీల్‌ ఇలా పేరుపేరున కపిల్‌ శుభాకాంక్షలు తెలిపారు. అయితే కపిల్‌ శర్మ షోకు ఎందుకు వెళ్లలేదని సునీల్‌ను ప్రశ్నించగా.. ‘‘సల్మాన్‌, కత్రినాలు ప్రమోషన్‌ చేస్తుండగా నా అవసరం ఏముంటుంది. అంతేకాకుండా నా మనసు వెళ్లడానికి అంగీకరించలేదు కాబట్టి వెళ్లలేద’’ని చెప్పటం గమనార్హం.

మరిన్ని వార్తలు