మూండ్రు ముగం రీమేక్ అవుతుందా?

24 Feb, 2014 02:36 IST|Sakshi
మూండ్రు ముగం రీమేక్ అవుతుందా?
 మూండ్రు ముగం చిత్రం రీమేక్ అవుతుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. 1982లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం మూండ్రు ముగం. రజనీకాంత్ ఇందులో అలెక్స్ పాండియన్, అరుణ్, జాన్  వంటి మూడు పాత్రలు పోషించారు. వీటిలో అలెక్స్ పాండియన్ పాత్ర సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది. పోలీసు అధికారిగా పవర్‌ఫుల్ పాత్రలో రజనీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఈ చిత్రానికి మరిత బలాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నటించిన రజనీకాంత్‌ను తమిళనాడు స్టేట్ ఉత్తమ నటుడుగా గౌరవించింది. రజనీకాంత్ నటించిన ఇలాంటి మైలు రాళ్ల చిత్రాల రీమేక్‌కు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఆయన నటించిన బిల్లా, మురట్టుకాళై చిత్రాలు ఇప్పటికే రీమేక్ అయ్యాయి. మూండ్రు ముగం చిత్రం రీమేక్‌లో నటించాలనే ఆసక్తిని ప్రస్తుత స్టార్ హీరోలు అజిత్, విజయ్, కార్తీ వ్యక్తం చేశారు. బిల్లా రీమేక్‌లో నటించిన అజిత్ హిట్ కొట్టారన్న విషయం తెలిసిందే.
 
 అయితే మూండ్రుముగం చిత్ర రీమేక్‌లో ప్రస్తుత హీరోలెవరూ నటించి మెప్పించలేరని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ అధికారి అలెక్స్ పాండియన్ పాత్రను నేటితరం హీరోలు పోషించి న్యాయం చేయడం అసాధ్యమేనంటున్నారు. తాజాగా సమాచారం ఏమిటంటే రజనీ మూండ్రుముగం రీమేక్‌లో యువ నటుడు కార్తి నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది. అజిత్ హీరోగా బిల్లా రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే విష్ణువర్ధన్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. తానిప్పుడు తన తమ్ముడు కృష్ణ ఆర్యలు కలిసి నటించే చిత్రం కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తాను సొంతంగా నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇంతకి మూండ్రుముగం రీమేక్ అవుతుందా? లేదా? అన్న అంశంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.