మామ తర్వాత అల్లుడితో

24 Feb, 2019 10:01 IST|Sakshi

యువ దర్శకుల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన తయారు చేసుకునే కథలు కూడా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటాయి. జిగర్‌తండా, కాదల్‌ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి ఇలా ఏ చిత్రానికి ఆ చిత్రం భిన్నంగా ఉంటాయి. ఇక ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు పేట చిత్రంతో సూపర్‌హిట్‌ చిత్రాన్ని ఇచ్చాడు కార్తీక్‌. అందులో రజనీ వయసు 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. అలా రజనీకాంత్‌కు సూపర్‌ సక్సెస్‌ ఇచ్చిన కార్తీక్‌సుబ్బరాజ్‌.. ఇప్పుడు ఆయన అల్లుడు, ధనుష్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.

వును నిజానికి వీరి కాంభినేషన్‌లో ఇంతకు ముందే చిత్రం రూపొందాల్సి ఉంది. ఆ సమయంలో ధనుష్‌ వడచెన్నై, మారి–2 చిత్రాలతో బిజీగా ఉండడంతో వాయిదా పడింది. దీంతో వీరి కాంభినేషన్‌లో చిత్రం ఆగిపోయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు కార్తీక్‌సుబ్బ రాజ్‌.. ధనుష్‌తో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కథ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. జూన్‌లో ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాను వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం న్యూయార్క్‌ నగరంలో చిత్రీకరించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ధనుష్‌ ప్రస్తుతం వెట్ట్రిమారన్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న అసురన్‌ చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించిన ఎన్నై నోక్కి పాయుమ్‌ తూట్టా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌తో విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు