బుల్లితెర దేవసేన కార్తీక

7 Jun, 2017 11:12 IST|Sakshi

బాహుబలి.. భారతీయ సినిమా స్థాయిని పదింతలు చేసిన సినిమా. కలెక్షన్ల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ ఈ విజువల్ వండర్ హాలీవుడ్ సినిమాలతో పోటి పడింది. ఇప్పుడు ఇదే స్థాయిలో బుల్లితెర మీద కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ప్రసారం కానుంది. బాహుబలి స్థాయిలో తెరకెక్కనున్న ఈ టీవీ సీరీస్ కు కూడా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సీరీస్ ఈ నెలాఖరు నుంచి టీవీలో ప్రసారమవుతోంది.

ఆరంభ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ టీవీ సీరీస్ జూన్ 24 నుంచి స్టార్ నెట్ వర్క్లో ప్రసారం కానుంది. రెండు వైరి వర్గాలకు చెందిన వరుణ దేవ, దేవసేన ప్రేమకథలో ఈ భారీ సీరియల్ ను రూపొందిస్తున్నారు. వరుణ దేవగా రజనీష్ దుగ్గల్ నటిస్తుండగా దేవసేన పాత్రలో జోష్, దమ్ము సినిమాల హీరోయిన్ కార్తీక నటిస్తోంది. ఈ సీరియల్ కోసం భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వినియోగిస్తున్నారు. ఈ భారీ సీరియల్ కు గోల్డీ బెహెల్ దర్శకత్వం వహిస్తున్నాడు.