థ్రిల్‌కి గురి చేసే కార్తికేయ

27 Sep, 2013 02:16 IST|Sakshi
థ్రిల్‌కి గురి చేసే కార్తికేయ
ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న ఉండదని, ఒకవేళ సమాధానం దొరక్కపోతే లోపం ఆ ప్రశ్నది కాదని, ప్రయత్నానిది అని నమ్మే మనస్తత్వం ఆ కుర్రాడిది. ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? తద్వారా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘కార్తికేయ’. 
 
‘స్వామి రారా’లాంటి విజయవంతమైన చిత్రం తర్వాత నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మాగ్నస్ సినీ ప్రైమ్ పతాకంపై శిరువూరి రాజేష్‌వర్మ సమర్పణలో వెంకట్ శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘థ్రిల్లర్‌తో కూడిన వినోదాత్మక చిత్రం ఇది. 
 
ఇప్పటివరకు వచ్చిన నిఖిల్ సినిమాలన్నిటికన్నా అధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. హీరో, హీరోయిన్లు వైద్య విద్యార్థులుగా కనిపిస్తారు. కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
>