మంచి బిరియాని తిన్న అనుభూతినిస్తుంది

9 Dec, 2013 00:57 IST|Sakshi
మంచి బిరియాని తిన్న అనుభూతినిస్తుంది
 ‘‘నాకు ‘బిరియాని’ చాలా స్పెషల్ మూవీ. ఇందులో ప్లేబోయ్‌గా నటించాను. తెలుగు ప్రేక్షకులకు మంచి స్పైసీ బిరియాని తిన్న ఫీల్‌ని ఇస్తుందీ సినిమా’’ అన్నారు కార్తీ. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కార్తీ, హన్సిక జంటగా జ్ఞానవేల్‌రాజా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘బిరియానీ’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను చిత్రం యూనిట్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ -‘‘అన్ని అంశాలనూ మేళవించి వెంకట్‌ప్రభు ఈ కథ తయారు చేశారు.
 
  యువన్ నా చిన్ననాటి స్నేహితుడు. అతనికి ఇది వందవ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. హన్సిక ఈ సినిమాకోసమే బరువు తగ్గారు. అలాగే మాండి థాకర్ చేసిన ఐటమ్‌సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సినిమా సక్సెస్ సాధిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఇందులో జర్నలిస్ట్ ప్రియగా నటించానని, కార్తీ మంచి టైమ్ సెన్స్ ఉన్న నటుడని హన్సిక చెప్పారు. దాసరిగారి ‘ఒసేయ్ రాములమ్మ’, ‘రౌడీ దర్బార్’ చిత్రాల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని రాంకీ అన్నారు. 
 
 నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ -‘‘తమిళంలో మేం తీసిన ప్రతి సినిమా తెలుగులో విడుదల చేశాం. వాటిల్లో తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయం సాధించిన సినిమాలున్నాయి. రాబోతున్న ‘బిరియాని’ కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నా నమ్మకం’’ అన్నారు. తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ -‘‘సూర్య కథానాయకునిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలోనే ఓ సినిమా చేయబోతున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రం మొదలవుతుంది. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఓ టాప్ డెరైక్టర్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా ఉంటుంది’’ అని జ్ఞానవేల్ రాజా తెలిపారు.