గ్రామీణ నేపథ్యంగా కరుప్పన్‌

1 Sep, 2017 03:45 IST|Sakshi
గ్రామీణ నేపథ్యంగా కరుప్పన్‌

తమిళసినిమా: చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలో బాగా తెలిసిన నిర్మాత ఏఎం.రత్నం అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యానించారు. ఏన్నో సంచలన హిట్‌ చిత్రాలను నిర్మించిన ఏఎం.రత్నం తాజాగా శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కరుప్పన్‌. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా నటి తాన్య నటించారు.

బాబీసింహ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రేణుగుంట చిత్రం ఫేమ్‌ పన్నీర్‌సెల్వమ్‌ దర్శకుడు. డి.ఇమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. విజయ్‌సేతుపతి మాట్లాడుతూ రేణుగుంట చిత్రంలోని వేశ్య పాత్రను కూడా ఎంతో ఉన్నతంగా చూపించిన దర్శకుడు పన్నీర్‌సెల్వం అని అన్నారు. ఈ పాత్రను కొంచెం కూడా అశ్లీలంగా చూపించలేదని, అలాగే ఇందులోని ఒక పాటను చాలా చక్కగా తెరకెక్కించారని చెప్పారు.

ఇక ఈ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం గురించి చెప్పాలంటే ఒక చిత్రానికి ఎలా ప్రచారం చేయాలో అనే యుక్తి తెలిసిన నిర్మాత ఆయనని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో రెగ్యులర్‌ ప్రతికథానాయకుడు అవసరం లేకపోయిందన్నారు. ఒక హీరోనే విలన్‌గా నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్న తరువాత నటుడు బాబీసింహాకు ఈ చిత్రం గురించి తాను చెప్పానన్నారు.ఆయన తనకు మంచి మిత్రుడు కావడంతో ఏమీ మాట్లాడకుండా ఇందులో  విలన్‌గా నటించడానికి అంగీకరించారని తెలిపారు.కరుప్పన్‌ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశం చోటు చేసుకుంటుందని, అయితే తాను ఎద్దును ముట్టుకోనుకూడా లేదని, ఆ సన్నివేశాలను రియల్‌ బుల్‌ఫైట్‌ క్రీడా వీరుల సన్నివేశాలతో ఫైట్‌ మాస్టర్‌ రాజశేఖర్‌ చాలా అద్భుతంగా మ్యాచ్‌ చేశారని విజయ్‌సేతుపతి తెలిపారు.

విజయ్‌సేతుపతి గురించి ముందే చెప్పా
ఈ చిత్ర ప్రారంభానికి ముందే విజయ్‌సేతుపతిని కలిసి మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పానని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలై మంచి విజయాలను సాధించాయన్నారు. ఇక కరుప్పన్‌ చిత్రం గురించి చెప్పాలంటే ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథా చిత్రం కాదన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే సహజత్వంతో కూడిన చిత్రంగా ఉంటుందని అన్నారు. ఇందులో హీరోయిన్‌ కోసం చాలా మందిని అనుకున్నా నటి తాన్య పాత్రకు నప్పడంతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. హీరో విజయ్‌సేతుపతితో పాటు అందరూ చాలా బాగా నటించారని చెప్పారు. చిత్ర క్‌లైమాక్స్‌ చాలా కొత్తగా ఉంటుందని నిర్మాత ఏఎం.రత్నం తెలిపారు.