అపజయాలెదురైనా వదల్లేదు

10 Aug, 2017 01:48 IST|Sakshi
అపజయాలెదురైనా వదల్లేదు

తమిళసినిమా: అపజయాలు ఎదురైనా సినిమాను వదల్లేదని యువ నటుడు విష్ణువిశాల్‌ అన్నారు. ఈయన హీరోగా నటిస్తూ సొంతగా విష్ణువిశాల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కథానాయకన్‌. నటి క్యాథరిన్‌ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఇందులో సూరి, ఆనందరాజ్, శరణ్యాపొన్‌వన్నన్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. మురుగానందం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్‌రోల్డన్‌ సంగీతం అందించారు.

ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల ఒక ఎఫ్‌ఎం రేడియో కార్యాలయంలో జరిగింది. కాగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మురుగానందం మాట్లాడుతూ విష్ణువిశాల్‌ మంచి నటుడే కాదు మంచి నిర్మాత కూడా అన్నారు. కథానాయకన్‌ చిత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పారు.

యూనిట్‌ అందరూ సమష్టిగా శ్రమించిన చిత్రం కథానాయకన్‌ అని పేర్కొన్నారు. చిత్ర హీరో, నిర్మాత విష్ణువిశాల్‌ మాట్లాడుతూ వెన్నెలా కబడ్డీకుళు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యానని, ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, ఆ తరువాత నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయన్నారు. అయినా సినిమాను వదలకుండా నిర్మాతగా మారి వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్‌ చిత్రం చేశానని, ఆ చిత్రం మీ ఆశీస్సులతో విజయం సాధించిందని అన్నారు. అదే విధంగా మంచి కథతో కథానాయకన్‌ చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించానని తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.