సాక్షి, ముంబై : ప్రస్తుతం బాలీవుడ్లో రణ్బీర్ కపూర్, అలియా భట్ల మధ్య ప్రేమాయణం హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి బంధానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం రణ్బీర్ కుటుంబం అలియాను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రణ్బీర్, అలియాల పెళ్లి తంతు ఒక్కటే మిగిలి ఉందని అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే రణ్బీర్తో రిలేషన్షిప్ వల్ల అలియాకు తన స్నేహితురాలు కత్రినా కైఫ్ మధ్య విభేదాలు తలెత్తాయని ప్రస్తుతం బీ- టౌన్లో వార్తలు విన్పిస్తున్నాయి.
సుమారు ఏడేళ్ల పాటు కొనసాగిన కత్రినా- రణ్బీర్ల బంధం రణ్బీర్ కుటుంబం కారణంగానే ముగిసిందని క్యాట్స్ సన్నిహితులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రణ్బీర్ కుటుంబం అలియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం.. వారిలో ఒకరిగా భావించడం కత్రినాకు కాస్త బాధగానే ఉందని ఆమె స్నేహితురాలు తెలిపింది. అయితే కత్రినా తెలివైంది గనుకనే ఎవరితో ఎంత వరకు ఉండాలో తనకు తెలుసునని.. తన అనుభవం కారణంగా వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించిందని కత్రినా స్నేహితురాలు చెప్పారు. ఒకరి విషయంలో జోక్యం చేసుకునే అలవాటు కత్రినాకు లేదని.. ఎవరైనా స్వానుభవం వల్లే జీవితంలో ప్రతీ విషయం నేర్చుకుంటారని తను భావిస్తుందని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తను సలహాలు ఇవ్వడం మొదలుపెడితే ‘అందని ద్రాక్ష పుల్లన’ అంటూ తనపైనే సెటైర్లు వేయడం మొదలుపెడతారని, అయినా ఈ బంధం ఎలా ముగుస్తుందో తనకు తెలుసంటూ కత్రినా వ్యాఖ్యానించినట్లు ఆమె తెలిపింది.