అలా మనసులో రాసుకోండి: కత్రినా

6 Jan, 2020 18:34 IST|Sakshi

డ్యాన్స్‌ ఇరగదీసే హీరోయిన్లలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ ముందు వరుసలో ఉంటుంది. ‘షీలా కీ జవానీ’, ‘కాలా ఛష్మా’, ‘చిక్నీ ఛమేలీ’ పాటలతో డ్యాన్స్‌ రానివారికి కూడా పూనకం తెప్పించింది. ఇక గతేడాది భారీ రెమ్యురేషన్‌ ముట్టజెప్తే ఓ పెద్దింటి పెళ్లిలోనూ కత్రినా డ్యాన్స్‌ చేసి అందరి మతులను పోగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కత్రినా తన స్నేహితుడి వివాహానికి హాజరైంది. డ్యాన్స్‌ చేయమని కత్రినాను ఎవరైనా ప్రాధేయపడ్డారో లేక పాట వినగానే ఊపొచ్చిందో తెలీదుగానీ ఒంటరిగా డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. స్టెప్పులేస్తూనే తన ఫ్రెండ్‌ను కూడా డ్యాన్స్‌ చేయడానికి రమ్మని ఆహ్వానించింది. ఇక ఇద్దరు కలిసి అప్పట్లో మార్మోగిన హిందీ సాంగ్‌ ‘అఫ్ఘన్‌ జిలేబీ..’ పాటకు చిందులేశారు. తర్వాత మరో కొంతమంది వచ్చి వారికి తోడుగా డ్యాన్స్‌ చేశారు.

ప్రస్తుతం కత్రినా డ్యాన్స్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో లేత నీలిరంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న కత్రినా డ్యాన్స్‌ చేస్తూ మరింత మనోహరంగా కనిపిస్తోంది. ‘ఈ ఏడాదిలో ప్రతిరోజూ మంచిరోజే అని మనసులో బలంగా రాసేసుకోండి’ అంటూ తన ఫొటోను కత్రినా అభిమానులతో పంచుకుంది. కాగా గతేడాది భారత్‌ సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న ఈ హీరోయిన్‌ ప్రస్తుతం ‘సూర్యవంశీ’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పోలీసాఫీసర్‌గా కన్పించనున్నాడు.

చదవండి: ముందు హీరోకు.. తర్వాతే హీరోయిన్‌కు

మరిన్ని వార్తలు